నూజివీడు ఎక్సైజ్ స్టేషన్ను సందర్శించిన జిల్లా అధికారులు
ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ బి. శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కే.వి. నాగ ప్రభు కుమార్ నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ను సోమవారం సందర్శించారు.
ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించిన అధికారులు, అనంతరం సిబ్బందితో సమావేశమై స్టేషన్ పనితీరును సమీక్షించారు. గత ఏడాది కాలంగా అదుపులో ఉన్న ఐ.డి. మద్యం (ఇల్లిసిట్ డిస్టిల్డ్ లిక్కర్) తయారీ, విక్రయాలు మళ్లీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గతంలో ఐ.డి. మద్యం కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై భారతీయ నాగరిక భద్రతా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్-129 కింద కేసులు నమోదు చేయాలని, పరారీలో ఉన్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సూచించారు. అలాగే పునరావాస చర్యలు చేపట్టడంతో పాటు వారి కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై నిరంతర తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని, ప్రజలు బహిరంగంగా మద్యం సేవించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు.