నూజివీడులో ముమ్మర వాహన తనిఖీలు.. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు
నూజివీడు, ఏలూరు జిల్లా: నూజివీడు పట్టణంలోని ప్రధాన కూడలి బస్టాండ్ సెంటర్ వద్ద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కృష్ణవేణి, ప్రవీణ ఆధ్వర్యంలో బుధవారం విస్తృత స్థాయిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, సరైన పత్రాలు లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
తనిఖీల సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపిన వారిని గుర్తించి జరిమానాలు విధించారు. అలాగే ట్రిపుల్ రైడింగ్, వాహనం నడుపుతూ మొబైల్ ఫోన్ మాట్లాడటం వంటి ప్రమాదకర చర్యలపై ప్రత్యేక నిఘా పెట్టారు.
మైనర్లు వాహనాలు నడపడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణించడం, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ వంటి తప్పనిసరి పత్రాలు లేకుండా వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పలు వాహనాలను సీజ్ చేశారు.
ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణే తమ లక్ష్యమని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణకు అత్యంత అవసరమని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.