న్యాయ, పోలీస్ శాఖల సమన్వయంతో సత్వర న్యాయం
న్యాయ, పోలీస్ శాఖల సమన్వయంతో సత్వర న్యాయం
వివిధ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయ, పోలీస్, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం, సహకారం అవసరమని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి పి. వసంత్ అన్నారు. శనివారం ఉదయాదిత్య భవన్లో నిర్వహించిన జిల్లా స్థాయి కో-ఆర్డినేషన్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టతరమైన కేసుల పరిష్కారంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు పోలీసుల సహకారం అవసరమన్నారు. ఇటీవల ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్య కేసును త్వరగా ఛేదించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ నేతృత్వంలోని పోలీసులను అభినందించారు.
కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ క్రిమినల్, అండర్ ట్రయల్, ఎన్బీడబ్ల్యూ కేసుల సత్వర పరిష్కారానికి మూడు శాఖల సమన్వయం అవసరమన్నారు. ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ ఈ-సాక్ష్యం, ఆధారాల సేకరణ, ఈ-సమన్లు వంటి సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని తెలిపారు. అదనపు జడ్జి కె. కవిత పెండింగ్లో ఉన్న ఎన్బీడబ్ల్యూ కేసులకు ప్రాధాన్యతనిచ్చి త్వరగా పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో మూడు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.