ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని కాపాడిన ఆటో డ్రైవర్.. మానవత్వానికి పోలీసుల ప్రశంసలు
ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని కాపాడిన ఆటో డ్రైవర్.. మానవత్వానికి పోలీసుల ప్రశంసలు
ఏ. కొండూరు, జూలై 19: ఎన్టీఆర్ జిల్లా ఏ. కొండూరులో ఆటో డ్రైవర్ చూపిన మానవత్వాన్ని పోలీసులు అభినందించారు. పోలిశెట్టిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ వాసం ప్రేమ్చంద్ జాతీయ రహదారిపై ఒంటరిగా ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలుడిని గుర్తించి వెంటనే తన ఆటోను ఆపి సురక్షితంగా తన వద్ద ఉంచుకున్నాడు.
బాలుడిని ఆరా తీయగా హాస్టల్ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పడంతో ఆలస్యం చేయకుండా ఏ. కొండూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు బాలుడి వివరాలను నిర్ధారించి, కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం అతడిని తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు.
ఆటో డ్రైవర్ ప్రేమ్చంద్ చూపిన బాధ్యతాయుతమైన సేవలను అభినందిస్తూ ఏ. కొండూరు ఎస్సై జి. మహాలక్ష్ముడు సన్మానించారు. ఈ సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొంటూ, ప్రజలు అప్రమత్తంగా ఉండి అవసరమైనప్పుడు సహాయకారిగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.