ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీ శా
ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం రామచంద్రపురం గ్రామంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీ శా గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్లు 229, 230, 231లను సందర్శించి జరుగుతున్న ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనదని, ఓటర్ల జాబితా భద్రత, పరిరక్షణ మనందరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రత్యేక సవరణ కార్యక్రమంపై ప్రజల్లో ఎలాంటి అపోహలు, అనుమానాలు అవసరం లేదని, అధికారులు పారదర్శకంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు.
ప్రజలకు ఏవైనా సందేహాలు ఉంటే సంబంధిత అధికారులను నేరుగా సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపుల ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరుగుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ ఏ. కుమార్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.