పాప్రికా మిర్చి కాంట్రాక్ట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు
ఏలూరు జిల్లా, లింగపాలెం, జూన్ 26: లింగపాలెం మండలంలోని లింగపాలెం గ్రామంలో కర్షక్ మిత్ర, లింగపాలెం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో పాప్రికా మిర్చి కాంట్రాక్ట్ వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా యాక్సిస్ డెవలప్మెంట్ సర్వీసెస్ సీనియర్ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ, కర్షక్ మిత్ర ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కాంట్రాక్ట్ వ్యవసాయ విధానం రైతులకు ధరల హెచ్చుతగ్గుల నుంచి రక్షణ కల్పించేలా రూపొందించబడిందని తెలిపారు. మార్కెట్లో ధరలు మారుతున్నా రైతులకు ముందుగానే మిర్చి కొనుగోలు ధరను నిర్ణయించడం ద్వారా ఆదాయానికి భరోసా కల్పిస్తామని చెప్పారు.
అలాగే పంట సాగు నుంచి కొనుగోలు వరకు ప్రతి అంశాన్ని రైతులతో చర్చించి, పరస్పర అంగీకారంతోనే కొనుగోలు ప్రక్రియ చేపడతామని వివరించారు. దీంతో రైతులు మార్కెట్ అనిశ్చితిపై ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కర్షక్ మిత్ర మేనేజ్మెంట్ ప్రతినిధులు సంజయ్, అశోక్, గ్రామోదయ ట్రస్టింగ్ సంస్థ ప్రతినిధి శ్రీనివాస్తో పాటు లింగపాలెం మండలం పరిసర ప్రాంతాలకు చెందిన పాప్రికా మిర్చి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు.