పార్టీ కోసం పోరాడిన వారిని పక్కన బెడుతూ... పదవులు మాత్రం పరాచికమా..?
పార్టీ కోసం పోరాడిన వారిని పక్కన బెడుతూ... పదవులు మాత్రం పరాచికమా..? కిరణ్ కుమార్ రెడ్డి
మైలవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పదవుల కేటాయింపుపై తీవ్ర చర్చ సాగుతోంది. 2019లో పార్టీ ఓటమి పాలై కష్టకాలాన్ని ఎదుర్కొన్న సమయంలో పార్టీ జెండాను భుజాన మోసిన కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది.
"పార్టీ కోసం ఎండనక, వాననక తిరిగిన వాళ్లకు గుర్తింపు లేదా..? ఇంట్లో కూర్చున్న వాళ్లకు పదవులా..?" అంటూ తెలుగు తమ్ముళ్లు బహిరంగంగానే ప్రశ్నిస్తున్న పరిస్థితి నెలకొంది.
పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ కనిపించని వారు, ఎన్నికల సమయంలో కూడా చురుకుగా పనిచేయని వారు ఒక్కసారిగా కీలక పదవులు దక్కించుకోవడం వెనుక అసలు కారణాలేంటన్న ప్రశ్నలు కార్యకర్తల మధ్య హాట్ టాపిక్గా మారాయి. కష్ట సమయంలో పార్టీని కాపాడిన సైనికులను పక్కనపెట్టి, చివరి నిమిషంలో వచ్చిన వారికి పెద్దపీట వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది.
"పార్టీ కోసం చెమటోడ్చిన వారికి కాదు... డబ్బున్న వారికి, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి, పలుకుబడి ఉన్న వారికే పదవులా?" అంటూ కార్యకర్తలు మండిపడుతున్నట్లు సమాచారం.
గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు లేకపోతే భవిష్యత్తులో పార్టీ మనుగడపైనే ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మైలవరం నియోజకవర్గంలో పదవుల కేటాయింపుపై నెలకొన్న అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని కష్టపడ్డ కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
"కష్టపడిన కార్యకర్తకు పదవి ఇవ్వండి... పార్టీని కేవలం ఎన్నికల సమయంలో గుర్తు చేసుకునే వారికి కాదు" అంటూ తెలుగు తమ్ముళ్లు గళమెత్తుతున్నారు.
పైడిమర్ల కిరణ్ కుమార్ రెడ్డి
తెలుగు యువత ఉపాధ్యక్షులు, ఎన్టీఆర్ జిల్లా