పాఠశాలల్లో గైడ్స్, ప్రైవేట్ స్టడీ మెటీరియల్కు నో.. విద్యాశాఖ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, ఎస్సీఈఆర్టీ, అమరావతి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల్లో గైడ్లు, కీబుక్స్, అనధికారిక ప్రైవేట్ స్టడీ మెటీరియల్ వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. Rc.No.11/T6/SCERT/2020 ప్రకారం ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించింది.
విద్యార్థుల్లో బట్టీ పట్టే విధానాన్ని తగ్గించి, స్వయంగా ఆలోచించే సామర్థ్యం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యం, సృజనాత్మకతను పెంపొందించడమే ఈ నిర్ణయం లక్ష్యమని పేర్కొంది. ఇప్పటికే జారీ చేసిన జి.ఓ.ఎం.ఎస్. నెం.17, తేదీ: 14-05-2014 నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేసింది.
ఎస్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలలో ప్రతి యూనిట్ చివర ఇచ్చిన వ్యాయామాలను విద్యార్థులు స్వయంగా ఆలోచించి పూర్తి చేయాలని, గైడ్లు లేదా ఇతరుల నోట్స్ నుంచి కాపీ చేయడం నిషేధమని తెలిపింది.
ప్రధానోపాధ్యాయులు తమ పాఠశాలల్లో గైడ్లు, ప్రైవేట్ స్టడీ మెటీరియల్ వినియోగం జరగకుండా పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు గైడ్లు కొనుగోలు చేయాలని ప్రోత్సహించినా లేదా పాఠశాలలో వాటి వినియోగాన్ని అనుమతించినా ప్రభుత్వ ఆదేశాల ఉల్లంఘనగా పరిగణించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఈ నిబంధనల అమలును ప్రాంతీయ సంయుక్త విద్యాశాఖాధికారులు, జిల్లా విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించింది.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పాఠశాలల్లో ఎస్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలే బోధిస్తున్నారో లేదో గమనించాలని, గైడ్లు లేదా అనధికారిక ప్రైవేట్ స్టడీ మెటీరియల్ వినియోగం కనిపిస్తే వెంటనే సంబంధిత మండల లేదా జిల్లా విద్యాశాఖాధికారులకు సమాచారం అందించాలని సూచించింది.
మన పిల్లల భవిష్యత్తు బట్టీ పట్టే విద్యలో కాదు... స్వయంగా ఆలోచించే, సృజనాత్మక విద్యలోనే ఉందని విద్యాశాఖ స్పష్టం చేసింది.