విశాఖకు రేపు వైఎస్ జగన్ పర్యటన
తాడేపల్లి, జూలై 14: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు.
ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులను కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడంతో పాటు, పార్టీ తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇవ్వనున్నారు. అలాగే అదే ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్న కారి చిన్నాను పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు.
పర్యటనలో భాగంగా ఉదయం 9:30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు. అనంతరం జబ్బార్ తోటలో బోటు ప్రమాద బాధిత కుటుంబాలను కలుస్తారు. తర్వాత కారి చిన్నాను పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు.
బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఇప్పటికే పార్టీ నాయకులకు సూచించిన వైఎస్ జగన్, ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రతినిధులు రాజులపాటి కళ్యాణి, శివప్రసాద్ దంపతులు తెలిపారు.