పేద కుటుంబాల ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా
పేద కుటుంబాల ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా : ఎమ్మెల్యే వేముల వీరేశం
పేద, మధ్యతరగతి కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. నార్కెట్పల్లి మండలానికి చెందిన 102 మంది లబ్ధిదారులకు గురువారం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఆయన ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో రహదారులు, విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలను గుర్తిస్తూ, స్థానిక సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ ప్రతి ఇంటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు సకాలంలో అందించి ఆదుకున్నందుకు లబ్ధిదారులు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యే వేముల వీరేశానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.