పచ్చిరొట్ట పంటలతో భూమికి కొత్త ఊపు..
పచ్చిరొట్ట పంటలతో భూమికి కొత్త ఊపు.. రైతులకు మోరంపూడి శ్రీనివాసరావు సూచనలు
చాట్రాయి మండలం చనుబండ గ్రామంలో సోమవారం రైతు సేవా కేంద్రం సందడిగా మారింది. సబ్సిడీపై జీలుగ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు రైతులకు కీలక సూచనలు చేశారు.
రసాయన ఎరువుల వినియోగంతో భూములు క్రమంగా సారాన్ని కోల్పోతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో జీలుగ, పిల్లిపెసర, జనుము వంటి పచ్చిరొట్ట పంటలు రైతులకు వరంగా మారుతున్నాయని అన్నారు. ఈ పంటలను సాగు చేసి భూమిలో కలపడం వల్ల నేల గుల్లబారి నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని వివరించారు. అంతేకాకుండా తర్వాత వేసే పంటలకు అవసరమైన నత్రజని, భాస్వరం, సూక్ష్మ పోషకాలు సహజంగానే లభించి దిగుబడులు పెరుగుతాయని తెలిపారు.
“భూమిని కాపాడితేనే రైతు భవిష్యత్తు బాగుంటుంది.. పచ్చిరొట్ట పంటలు రైతుకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం అందిస్తాయి” అంటూ మోరంపూడి రైతులకు పిలుపునిచ్చారు. రైతులు కూడా ఆసక్తిగా సూచనలు విన్నారు.
కార్యక్రమంలో వీఏఏ నాగమణి, రైతులు జక్కంపూడి ప్రదీప్, గవర వెంకటేశ్వరరావు, ముద్దుల శ్రీనివాసరావు, గోపాలరావు, మోరంపూడి త్రిమూర్తి, మేడా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.