పది దొంగ బైక్లు పట్టివేత... కిలాడీ దొంగ అరెస్ట్..
పది దొంగ బైక్లు పట్టివేత... కిలాడీ దొంగ అరెస్ట్..
జల్సాలకు అలవాటుపడి రాయలసీమ వ్యాప్తంగా చోరీలు..
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి, ఐపీఎస్
రాయలసీమ జిల్లాల్లో వరుస మోటార్ సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారిన ఓ కిలాడీ దొంగను మదనపల్లె టూటౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి నుంచి సుమారు రూ. 4.61 లక్షల విలువైన 10 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం మదనపల్లి లోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో *జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు* ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
పోలీసుల వలలో చిక్కిందిలా..
మదనపల్లె డీఎస్పీ బి. పావని పర్యవేక్షణలో, టూటౌన్ సీఐ ఎస్. మహమ్మద్ రఫీ కి అందిన పక్కా సమాచారంతో.. ఎస్ఐ వి. నాగేశ్వరరావు తమ సిబ్బందితో కలిసి ఆదివారం సాయంత్రం స్థానిక చౌడేశ్వరి గుడి వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో చౌడేశ్వరి కళ్యాణ మండపం వైపు నుంచి హోండా యూనికార్న్ బైక్పై వచ్చిన ఓ వ్యక్తి పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించాడు. అప్రమత్తమైన సిబ్బంది అతన్ని వెంబడించి పట్టుకున్నారు. విచారణలో అతను అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ కుప్పం మల్లికార్జున (40) గా తేలింది.
బస్టాండ్లు, ఆసుపత్రులే టార్గెట్..
జల్సాలు, పేకాట తదితర వ్యసనాలకు బానిసైన మల్లికార్జున.. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో 2022 నుంచి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు తదితర జిల్లాల్లో బైక్ల చోరీలకు పాల్పడుతున్నాడు. ముఖ్యంగా ఆర్టీసీ బస్టాండ్లు, ఆసుపత్రులు, సచివాలయాల వద్ద పార్క్ చేసిన ద్విచక్ర వాహనాల తాళాలు విరగ్గొట్టి దొంగిలించడం ఇతని తీరు. దొంగిలించిన బైక్లను ముందుగా లక్కిరెడ్డిపల్లె పరిసరాల్లో దాచి, ఆ తర్వాత మదనపల్లెలోని వైఎస్ఆర్ కాలనీ, జీనత్ ఫంక్షన్ హాల్ వెనుక ఉన్న ఒక పాడుబడిన గదికి తరలించేవాడు. వీటికి సరైన పత్రాలు లేకపోవడంతో స్థానికంగా విక్రయించడం కష్టమని భావించి, బెంగళూరులో అమ్మేందుకు ప్రణాళిక వేస్తుండగా పోలీసులకు చిక్కాడు.
10 ద్విచక్ర వాహనాల స్వాధీనం..
పట్టుబడిన సమయంలో అతని వద్ద ఉన్న బైక్తో పాటు, దాచి ఉంచిన మరో 9 బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లె టూటౌన్, మదనపల్లె రూరల్, పుంగనూరు, తిరుపతి ఈస్ట్, కదిరి టౌన్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించిన వాహనాలుగా వీటిని గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు:
1. AP-03-BJ-4601 (హోండా యూనికార్న్)
2. AP-39-KE-1805 (హోండా యూనికార్న్)
3. AP-03-BQ-6677 (హోండా షైన్)
4. AP-03-BE-4300 (హోండా షైన్)
5. AP-03-CR-8707 (హోండా యూనికార్న్)
6. AP-03-CU-6557 (హోండా యూనికార్న్)
7. TN-23-CD-9708 (హోండా షైన్)
8. AP-03-CS-1268 (హీరో స్ప్లెండర్+)
9. AP-02-BF-2785 (హోండా యూనికార్న్)
10. AP03-CQ-3512 (హోండా యూనికార్న్)
గుర్తింపును దాచేందుకు నిందితుడు కొన్ని బైక్ల ఇంజిన్, ఛాసిస్ నంబర్లను సైతం గోకివేయడం గమనార్హం.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ విజ్ఞప్తి..
మోటార్ సైకిల్ దొంగతనాల నివారణకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు సూచించారు..
బహిరంగ ప్రదేశాల్లో వాహనాలు నిలిపేటప్పుడు తప్పనిసరిగా హ్యాండిల్ లాక్తో పాటు అదనపు తాళం వేసుకోవాలి. సీసీ కెమెరాలు ఉన్న సురక్షిత ప్రదేశాల్లోనే పార్క్ చేయాలి.
దొంగతనం జరిగినప్పుడు గుర్తించేందుకు వీలుగా వాహనం రిజిస్ట్రేషన్, ఇంజిన్, ఛాసిస్ నంబర్లను తమ వద్ద నమోదు చేసి పెట్టుకోవాలి. జీపీఎస్ ట్రాకర్లు అమర్చుకోవడం వల్ల వాహన భద్రత పెరుగుతుంది.
సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 కు సమాచారం అందించాలి.
పోలీస్ సిబ్బందికి ప్రశంసలు
పక్కా సమాచారంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి నిందితుడిని అరెస్ట్ చేసిన టూటౌన్ సీఐ రఫీ, ఎస్ఐ నాగేశ్వరరావుతో పాటు కానిస్టేబుళ్లు (పిసి లు: 4470, 3734, 1716)లను, సహకారం అందించిన జిల్లా క్రైమ్ ఇన్స్పెక్టర్ యం.చంద్రశేఖర్ మరియు క్రైమ్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సుదీర్ఘకాలంగా రాయలసీమ జిల్లాలను వణికిస్తున్న దొంగను పట్టుకుని, బాధితుల ఆస్తులను రక్షించిన వీరి పనితీరు అన్నమయ్య జిల్లా పోలీసు విభాగానికి గర్వకారణమని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ. ఎం. వెంకటాద్రి గారు, మదనపల్లి డిఎస్పీ బి. పావని గారు, 2 వ పట్టణ సీఐ. ఎస్.మహమ్మద్ రఫీ, ఎస్బి సీఐ పి. రాజా రమేష్, 2 వ పట్టణ ఎస్ఐ లు వి. నాగేశ్వర రావు, బి .రామాంజనేయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
అన్నమయ్య పోలీస్