పద్మశాలీల జనాభా కుల గణనలో 6 లక్షల మందిని ఎందుకు తగ్గించారు?
పద్మశాలీల జనాభా ఏమైంది?
కుల గణనలో 6 లక్షల మందిని ఎందుకు తగ్గించారు?:
శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంఘం ప్రశ్న
మంచిర్యాల: తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలను రాజకీయంగా, సామాజికంగా ఎదగకుండా అణచివేసేందుకు పాలకులు కుట్రలు పన్నుతున్నారని, ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కుల గణన సర్వేలో పద్మశాలీల జనాభాను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపడం ఈ కుట్రలో భాగమేనని శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి స్వచ్ఛంద సేవా సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కీలక సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన నివేదిక పూర్తిగా తప్పుల తడాఖా అని, ఇది పద్మశాలి సమాజ ఉనికికే ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2015లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలీల జనాభా 18 లక్షలుగా తేలిందని, కానీ 11 ఏళ్ల తర్వాత జనాభా పెరగాల్సింది పోయి ప్రస్తుతం కేవలం 11,79,031 (3.3 శాతం) గా చూపించడం వెనుక ఉన్న మతలబు ఏంటని వారు ప్రశ్నించారు. ఈ సర్వేలో మాయమైన ఆ 6 లక్షల మంది పద్మశాలీలు ముంబై, సూరత్, దుబాయ్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లారా లేక మరణించారా అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవానికి రాష్ట్రంలో పద్మశాలీల జనాభా 30 నుండి 35 లక్షల వరకు ఉంటుందని, జనాభా ఎక్కువగా చూపిస్తే రాజకీయంగా ఎక్కువ సీట్లు, బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించాల్సి వస్తుందనే భయంతో అగ్రవర్ణ పాలకులు మా సమాజాన్ని బలిపెట్టారని వారు మండిపడ్డారు. పద్మశాలీలకు ఉన్న 19 ఉపకులాల ప్రస్తావన కూడా ఈ సర్వేలో లేకపోవడం ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని, తక్షణమే ప్రజాస్వామ్యబద్ధంగా తిరిగి కుల గణన నిర్వహించాలని వారు పట్టుబట్టారు. స్వతంత్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో రాజకీయాలకు అతీతంగా పద్మశాలీలంతా ఏకమై రాజ్యాధికారంలో వాటా కోసం, సామాజిక న్యాయం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక నేత, సంస్థ అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్యతో పాటు ఉపాధ్యక్షుడు జంజీరల నారాయణ, కార్యదర్శి అడిచర్ల రాజేశం, కోశాధికారి పరిసె శ్రీను, నాయకులు బొడ్డున బాపు రావు, దేవులపల్లి రామస్వామి, సత్యనారాయణ, సిహెచ్ రామస్వామి, అశోక్ వేముల, ఎం. రామదాస్ తదితరులు పాల్గొని జై మార్కండేయ అంటూ నినదించారు