పెదవేగి ఆయిల్ ఫెడ్లో కొత్త కర్మాగారం నిర్మించాలి....
పెదవేగి ఆయిల్ ఫెడ్లో కొత్త కర్మాగారం నిర్మించాలి.. ఆయిల్ పామ్ రైతులకు న్యాయం చేయాలి
ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్
ఏలూరు: ఆయిల్ పామ్ రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలంటే పెదవేగిలోని ఏపీ ఆయిల్ ఫెడ్ కర్మాగారం స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త కర్మాగారం నిర్మించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 5.66 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని, దాదాపు 1.80 లక్షల మంది రైతులు ఈ పంటపై ఆధారపడి ఉన్నారని తెలిపారు. ఏటా సుమారు 20 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల ఉత్పత్తి జరుగుతోందని, వీటి నుంచి 3.31 లక్షల టన్నుల ముడి పామోలిన్ ఉత్పత్తి అవుతోందన్నారు.
ఆయిల్ పామ్ గెలల ధర నిర్ణయానికి ఏపీ ఆయిల్ ఫెడ్ పెదవేగి కర్మాగారంలో వచ్చే రికవరీ శాతం (ఓఈఆర్) ప్రామాణికంగా ఉందని, అయితే పాత యంత్రాల కారణంగా ఇక్కడ తక్కువ ఓఈఆర్ రావడంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అశ్వారావుపేట ఆయిల్ ఫెడ్ కర్మాగారం అభివృద్ధి చెందగా, ఆంధ్రప్రదేశ్లోని పెదవేగి కర్మాగారం మాత్రం నిర్లక్ష్యానికి గురైందన్నారు. తెలంగాణలో కొత్త కర్మాగారాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఏపీలో ఉన్న కర్మాగారం ఆధునీకరణకు ప్రభుత్వాలు దృష్టి పెట్టలేదని విమర్శించారు.
2014 నుంచి 2019 వరకు ఓఈఆర్లో 2 శాతం వ్యత్యాసం కారణంగా ఆయిల్ పామ్ రైతులు నష్టపోయారని తెలిపారు. ఆ నష్టానికి పరిహారం ఇస్తామని చెప్పినా నిధులు విడుదల కాలేదన్నారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం తెలంగాణ ఓఈఆర్ ఆధారంగా ధర నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు.
పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం 1992లో నిర్మించారని, ప్రస్తుతం కాలం చెల్లిన యంత్రాలతో నడుస్తుండటంతో ఆశించిన స్థాయిలో నూనె శాతం రావడం లేదన్నారు. ఏడాదికి 1.65 లక్షల టన్నుల గెలలను క్రషింగ్ చేయాల్సి ఉండగా సగటున లక్ష టన్నుల వరకు మాత్రమే చేస్తున్నారని, మిగిలిన గెలలను ఇతర ప్రైవేట్ కర్మాగారాలకు తరలిస్తున్నారని తెలిపారు.
ప్రైవేట్ కర్మాగారాలు ఆధునిక యంత్రాలతో నిర్మాణం కావడంతో 20 శాతానికి పైగా ఓఈఆర్ సాధిస్తున్నాయని, కానీ పెదవేగి ఆయిల్ ఫెడ్లో తక్కువ శాతం రావడం వల్ల రైతులకు నష్టం జరుగుతోందన్నారు.
పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగారం లాభాల్లోనే నడుస్తున్నప్పటికీ, గత ప్రభుత్వాలు సంస్థకు వచ్చిన లాభాలను ఇతర అవసరాలకు మళ్లించాయని ఆరోపించారు. కొత్త కర్మాగారం నిర్మాణానికి సుమారు రూ.200 కోట్లు అవసరమని, జాతీయ స్థాయిలో ఆయిల్ పామ్ అభివృద్ధికి ఉన్న నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించే అవకాశం ఉందన్నారు.
ఆయిల్ పామ్ సాగులో దేశంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణం ఏలూరు జిల్లాలోనే ఉందని తెలిపారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరారు.
ఏపీ ఆయిల్ ఫెడ్ కర్మాగారాన్ని ప్రైవేటీకరించే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సంస్థను ప్రైవేటీకరిస్తే రైతులకు న్యాయమైన ధర దక్కే అవకాశం ఉండదన్నారు.
తెలంగాణలో రైతుల కోసం కొత్త ఆయిల్ ఫెడ్ యూనిట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్న తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా పెదవేగి స్థానంలో ఆధునిక కర్మాగారం నిర్మించాలని కోరారు.
ఆయిల్ పామ్ రైతులకు శాశ్వతంగా మేలు జరగాలంటే కొత్త కర్మాగారం నిర్మాణమే మార్గమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిధులు కేటాయించి చర్యలు చేపట్టాలని కె. శ్రీనివాస్ కోరారు.