పెళ్లికి రూ.40 లక్షలు డిమాండ్.. నిరాకరించడంతో కూతురిపై తండ్రి కత్తి దాడి
పెళ్లికి రూ.40 లక్షలు డిమాండ్.. నిరాకరించడంతో కూతురిపై తండ్రి కత్తి దాడి
కర్ణాటకలో దారుణ ఘటన చోటుచేసుకుంది. విజయపురకు చెందిన నాగేంద్ర తన కుమార్తె లక్ష్మీదుర్గ వివాహం విషయంలో తీవ్ర వివాదానికి కారణమయ్యాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న లక్ష్మీదుర్గకు ఇటీవల పెళ్లి సంబంధం రావడంతో, ఆమె చదువుకు చాలా ఖర్చు చేశానని చెబుతూ వరుడి కుటుంబాన్ని రూ.40 లక్షలు ఇవ్వాలని నాగేంద్ర డిమాండ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా, వివాహం తర్వాత కూడా కుమార్తె జీతం తనకే ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
నాగేంద్ర నిర్ణయాన్ని కుటుంబ సభ్యులు వ్యతిరేకించడంతో ఆగ్రహానికి గురైన అతడు, లక్ష్మీదుర్గ పనిచేస్తున్న కళాశాలకు వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో లక్ష్మీదుర్గ తీవ్రంగా గాయపడగా, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.