పెనుగొలలో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
పెనుగొలలో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు
స్వాతంత్ర్య సమరయోధుడిగా, తొలి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చిరస్మరణీయం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని గ్రంథాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు 1872 ఆగస్టు 23న గోపాలకృష్ణయ్య, సుబ్బమ్మ దంపతులకు జన్మించారని తెలిపారు. మద్రాసులో న్యాయశాస్త్రం అభ్యసించిన అనంతరం లండన్ వెళ్లి 1907లో బారిష్టర్ కోర్సు పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చారని వివరించారు.
మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా మంచి పేరు సంపాదించిన ప్రకాశం పంతులు 1921లో స్వాతంత్ర్య ఉద్యమంలోకి అడుగుపెట్టి తన వృత్తిని, సంపాదనను దేశ సేవకు అంకితం చేసిన గొప్ప మహనీయుడని కొనియాడారు.
1928లో మద్రాసులో జరిగిన సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో పోలీసుల కాల్పులకు ఎదురుగా నిలిచి తన చొక్కా విప్పి గుండె చూపిస్తూ "దమ్ముంటే కాల్చండి" అంటూ ధైర్యంగా ముందుకు సాగిన ఆయన సాహసం కారణంగానే ప్రజలు ఆయనకు ఆంధ్రకేసరి బిరుదు ప్రదానం చేశారని తెలిపారు.
తోలేటి జయసింహ మాట్లాడుతూ ప్రకాశం పంతులు 1941లో వ్యక్తిగత సత్యాగ్రహంలో, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. 1953 అక్టోబర్ 1 నుంచి 1954 నవంబర్ 15 వరకు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేశారని వివరించారు.
1957 మే 20న అనారోగ్యంతో మరణించిన ప్రకాశం పంతులు చివరి దశలో కూడా సాధారణ జీవితం గడిపారని, ఆయన నిస్వార్థ రాజకీయ జీవితానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అలుగుల అనంతరాములు, గుంత రాము, పాశం రాఘవులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.