పెనుగొలను ఆదర్శ పాఠశాలలో ఘనంగా బమ్మెర పోతన జయంతి వేడుకలు
పెనుగొలను ఆదర్శ పాఠశాలలో ఘనంగా బమ్మెర పోతన జయంతి వేడుకలు
పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో సహజ కవి బమ్మెర పోతన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోతన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొర్రపాటి యోహాను మాట్లాడుతూ బమ్మెర పోతన (1450-1510) ప్రముఖ కవి, పండితుడిగా తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర గ్రామంలో కేసన-లంకమాంబ దంపతులకు జన్మించిన పోతన సంస్కృతంలో మహర్షి వేదవ్యాసుడు రచించిన భాగవతాన్ని తెలుగులోకి అనువదించారని వివరించారు.
పోతన భాగవతం పండితులు, సామాన్యులు అందరినీ ఆకట్టుకునే గొప్ప గ్రంథమని, ఆయన పద్యాలు మధురమైన భాషా శైలితో తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయని కొనియాడారు.
విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ భాగవతంతో పాటు భోగినీ దండకం, వీరభద్ర విజయం, నారాయణ శతకం వంటి రచనలు కూడా పోతన కవికి గొప్ప పేరు తీసుకొచ్చాయని తెలిపారు.
శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ పోతన తన భాగవతాన్ని ధనానికి ఆశపడకుండా ఏ రాజుకూ అంకితం చేయకుండా శ్రీరాముడికి అంకితం చేసిన గొప్ప భక్త కవి అని పేర్కొన్నారు. పాండిత్యం ఉన్నప్పటికీ రైతుగా వ్యవసాయ పనులు చేయడానికి ఆయన ఎప్పుడూ వెనుకాడలేదని వివరించారు.
ఈ సందర్భంగా సేవా కమిటీ సభ్యులు పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఉపాధ్యాయులు కే. లీలా శంకర్, కే. సుజాత, జి. అలేఖ్య, డి. బేబీ తదితరులు పాల్గొన్నారు.