పెనుగొలను హైస్కూల్లో వీర వనిత ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను జిల్లా పరిషత్ హైస్కూల్లో గురువారం వీరవనిత Rani Lakshmibai వర్ధంతి కార్యక్రమాన్ని శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎం. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయి చేసిన పోరాటం, భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఆమె పోషించిన కీలక పాత్రను విద్యార్థులకు వివరించారు.
విద్యార్థులు చిన్నప్పటి నుంచే దేశభక్తి, సేవాభావం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని ఆయన సూచించారు. మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా పాఠశాల పూర్వ విద్యార్థి పరుచూరు హరిమాధవ గుప్త విద్యార్థుల యోగా కార్యక్రమాలకు ఉపయోగపడే టార్పాలిన్ షీట్లను పాఠశాలకు అందజేశారు. ఆయన సేవాభావాన్ని ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.
కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.