పెనుగొలనులో ఘనంగా అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో మంగళవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఏడుగురు వితంతువులను కమిటీ సభ్యులు నూతన వస్త్రాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వక్తలు అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. వితంతువులను సమాజంలో అందరితో సమానంగా గౌరవించడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, విశ్రాంతి ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి, ఉపాధ్యాయురాలు కె. లింగమ్మతో పాటు కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమం సామాజిక చైతన్యాన్ని పెంపొందించేలా సాగింది.