పెనుగొలనులో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
పెనుగొలను: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో బుధవారం జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా కేక్ కట్ చేసి, అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు.
అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని ప్రజాదరణ పొందిన అగ్ర కథానాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో జనసేన పార్టీని స్థాపించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేసి ఘన విజయం సాధించిందని, కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని వక్తలు కొనియాడారు.
పవన్ కళ్యాణ్కు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని ఆకాంక్షించారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని కోరుతూ శిరిడి సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, కమిటీ సభ్యుడు ఇలాసాగరపు రాంబాబు, ఉపాధ్యాయురాలు కే. లింగమ్మ, జనసేన నాయకులు సూరంశెట్టి రామయ్య, రాళ్లచర్ల రామకృష్ణ, డాక్టర్ బండారు గోపి, ఓరుగంటి సురేష్, అంగన్వాడీ సిబ్బంది, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.