పెనుగొలనులో హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు వర్ధంతి ఘనంగా నిర్వహణ
పెనుగొలనులో హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు వర్ధంతి ఘనంగా నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం:
తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో రచయిత, నటుడు, నాటకకర్త భమిడిపాటి కామేశ్వరరావు 68వ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ భమిడిపాటి కామేశ్వరరావు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో 1897 ఏప్రిల్ 28న జన్మించారని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే సమాజ చైతన్యం కోసం నాటకాలు, నాటికలు, కథలు రచించారని వివరించారు.
హాస్య రచనల్లో తనదైన ముద్ర వేసిన కామేశ్వరరావు కలం నుంచి ఎప్పుడూ ఇంతే, కచట తపలు, పెళ్లి ట్రైనింగు, ఘటన, బాగు బాగు, అన్నీ తగాదాలే, అప్పుడు ఇప్పుడు, కాలక్షేపం, గుసగుసల పెళ్లి వంటి అనేక హాస్య రచనలు వెలువడ్డాయని పేర్కొన్నారు.
తన అద్భుతమైన హాస్య రచనా ప్రతిభకు గుర్తింపుగా జయపూర్ మహారాజు ఆయనకు "హాస్యబ్రహ్మ" బిరుదును ప్రదానం చేశారని తెలిపారు. తన రచనల ద్వారా ఎందరో పాఠకులను మనసారా నవ్వించిన భమిడిపాటి కామేశ్వరరావు 1958 ఆగస్టు 28న తుదిశ్వాస విడిచారని గుర్తు చేసుకున్నారు.
వర్ధంతి సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు కే. లింగమ్మ, మీనుగు శివమ్మ, పొనుగుపాటి పెద్ద వెంకటేశ్వర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.