Tribute: మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా | గంపలగూడెం | జూన్ 28 | NTODAY NEWS
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావు 105వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నరసింహారావు చిత్రపటానికి కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.
శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ, పి.వి. నరసింహారావు బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, దేశ ఆర్థిక సంస్కరణలకు మార్గదర్శకుడిగా నిలిచారని అన్నారు. భారత అభివృద్ధిలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని, ఆయన నాయకత్వం నేటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, అనంతరం భారత ప్రధానమంత్రిగా పలు కీలక బాధ్యతలు నిర్వహిస్తూ దేశ అభివృద్ధికి విశేష సేవలు అందించారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు పాశం వెంకటేశ్వర్లు, వడ్డెరపు నాగేశ్వరరావు, కోరంపల్లి భద్రం, మహిళా సభ్యులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.