పెనుగొలనులో ప్రముఖ కళాకారుడు వాణి రంగారావుకు ఘన నివాళి
పెనుగొలనులో ప్రముఖ కళాకారుడు వాణి రంగారావుకు ఘన నివాళి
గంపలగూడెం జూలై 31: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలనులో శుక్రవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఇటీవల కన్నుమూసిన ప్రముఖ కళాకారుడు, వాణి స్టూడియో అధినేత వాణి రంగారావుకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.
సభలో కళాకారుడు ఇనపనూరి శంకరరావు మాట్లాడుతూ, రంగారావు నాటక కళాకారుడిగా మాత్రమే కాకుండా ఘంటసాల ఆలపించిన ఎన్నో గీతాలు, భగవద్గీతను తన మధుర స్వరంతో ఆలపించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారని చెప్పారు. అలాగే ఎదుటి వ్యక్తిని చూసి అద్భుతంగా చిత్రాన్ని గీయగల అరుదైన ప్రతిభ కలిగిన చిత్రకారుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉందని కొనియాడారు.
విశ్రాంత ప్రిన్సిపాల్ వెదురు వెంకటరెడ్డి మాట్లాడుతూ, రంగారావు కళారంగానికి అందించిన విశిష్ట సేవలను గుర్తించి పెనుగొలను శివాలయం, నెమలి వేణుగోపాలస్వామి ఆలయం, ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం తదితర ప్రాంతాల్లో ఘనంగా సన్మానించారని తెలిపారు. కళ పట్ల ఆయనకున్న అంకితభావం భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
నాటక కళాకారుడు మోదగు దానియేలు మాట్లాడుతూ, రంగారావు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయన ప్రదర్శించిన కళా వైభవం చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షుడు వూటుకూరు నారాయణరావు, కాన్వెంట్ ప్రిన్సిపాల్ వీరయ్య, విద్యార్థులు, కళాభిమానులు, గ్రామస్తులు పాల్గొని రంగారావు సేవలను స్మరించుకున్నారు.