వినాయక చవితి ఉత్సవాలకు సిద్ధమవుతున్న మండపాలు
తిరువూరు: తిరువూరు నియోజకవర్గంలో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలకు భక్తులు, ఉత్సవ కమిటీలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దండాలయ్యా, ఉండ్రాలయ్యా, గణపతి మహారాజ్కు జై అంటూ భక్తులు ప్రధమ పూజాధిపతి, ఆది దంపతులు శ్రీ పార్వతీ పరమేశ్వరుల పుత్రుడైన గణపతిని భక్తిశ్రద్ధలతో పూజించేందుకు సిద్ధమవుతున్నారు. వినాయక చవితి వేడుకల నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ముందుగానే వినాయక విగ్రహాలను మండపాలకు తరలిస్తున్నారు.
తిరువూరు నియోజకవర్గంలోని తిరువూరు, గంపలగూడెం, ఏ.కొండూరు, విస్సన్నపేట మండలాల పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాల్లో పలు ప్రాంతాల్లో వినాయక చవితి మండపాల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. మండపాలను అలంకరించడంతో పాటు విద్యుత్ దీపాలు, ఇతర ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేస్తున్నారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు ఉచిత విద్యుత్ వినియోగానికి అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు భక్తులకు, ఉత్సవ నిర్వాహకులకు సూచిస్తున్నారు. విద్యుత్ తీగలు, దీపాల ఏర్పాటు విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు.
గంపలగూడెం మండలంలోని పెనుగొలను గ్రామంలోనూ వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద, 99వ అంగన్వాడీ కేంద్రం వద్ద, బోటు ప్రాంతంలో, బస్టాండ్ సెంటర్ తదితర ప్రాంతాల్లో ఉత్సవ కమిటీలు మండపాలను సిద్ధం చేస్తున్నాయి. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.