పెనుగొలనులో సినీ పాటల రచయిత జాలాది రాజారావు 94వ జయంతి వేడుకలు
పెనుగొలనులో సినీ పాటల రచయిత జాలాది రాజారావు 94వ జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో ఆదివారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ పాటల రచయిత జాలాది రాజారావు 94వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాలాది రాజారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో జాలాది రాజారావు సినీ సాహిత్య ప్రస్థానం, తెలుగు పాటకు ఆయన అందించిన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు మాట్లాడుతూ జాలాది రాజారావు 1976లో ‘పల్లె సీమ’ చిత్రానికి గీత రచయితగా సినిమా రంగంలోకి ప్రవేశించారని తెలిపారు. దేశభక్తి, సామాజిక, తాత్విక, జానపద భావాలను తన పాటల్లో అద్భుతంగా పలికించిన గొప్ప సాహితీవేత్తగా జాలాది రాజారావు గుర్తింపు పొందారని పేర్కొన్నారు. సుమారు 275 సినిమాలకు 1500కు పైగా పాటలు, దాదాపు 1000 కవితలు, పలు సాంఘిక నాటకాలను రచించి తెలుగు సాహిత్య, సినీ రంగాలకు విశేష సేవలు అందించారని వివరించారు.
సీనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ‘మేజర్ చంద్రకాంత్’ చిత్రంలో జాలాది రాజారావు కలం నుంచి వెలువడిన ‘పుణ్యభూమి నా దేశం నమో నమామి’ పాట తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందని అన్నారు. దేశభక్తి భావాలను రగిలించే ఆ పాట నేటికీ తెలుగు నేలపై మారుమోగుతూనే ఉందని కొనియాడారు. సామాన్య ప్రజల జీవన విధానం, పల్లె సంస్కృతి, సామాజిక పరిస్థితులను తన రచనల్లో ప్రతిబింబించిన జాలాది రాజారావు సాహిత్య ప్రస్థానం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
జాలాది రాజారావు ప్రతిభకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డుతో పాటు కళాప్రపూర్ణ, కళాసాగర్, ఉత్తమ రచయిత తదితర పురస్కారాలు, అనేక సత్కారాలు లభించాయని తెలిపారు. తెలుగు సినీ సాహిత్యానికి ఆయన చేసిన సేవలను స్మరించుకోవడం, భావితరాలకు ఆయన రచనలను పరిచయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.
అనంతరం జాలాది రాజారావు జయంతిని పురస్కరించుకుని కార్యక్రమానికి హాజరైన వారికి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రముఖ కళాకారుడు పొనుగుపాటి పెద్ద వెంకటేశ్వర్లు, విద్యార్థులు, శిరిడి సాయిబాబా సేవా కమిటీ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.