పెనుగొలనులో వందేమాతరం రచయిత బంకించంద్ర ఛటర్జీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం జాతీయ గేయం "వందేమాతరం" రచయిత బంకించంద్ర ఛటర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, "వందేమాతరం" గేయం భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పోరాట యోధులకు స్ఫూర్తినిచ్చి, దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర జ్యోతిని వెలిగించిన సమర నినాదంగా నిలిచిందన్నారు.
బంకించంద్ర ఛటర్జీని బెంగాలీ సాహిత్య చరిత్రలో "సాహిత్య సామ్రాట్"గా కొనియాడుతారని, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో 13కు పైగా నవలలు, అనేక ధార్మిక గ్రంథాలు, వ్యాసాలను రచించి సాహిత్య ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు.
ప్రజల్లో జాతీయ చైతన్యం నింపేందుకు ఆయన రచించిన "ఆనందమఠం", "దుర్గేష్ నందిని", "కాపాల కుండల", "విషవృక్షము" వంటి రచనలు విశేష ఆదరణ పొందాయని వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొని బంకించంద్ర ఛటర్జీ సేవలను స్మరించుకున్నారు.