పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ ఆందోళన.. చిత్తపూరులో ఆటో లాగి వినూత్న నిరసన
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. పెరిగిపోతున్న ఇంధన ధరలకు నిరసనగా కార్యకర్తలు ఆటోను తాళ్లతో లాగుతూ వినూత్నంగా ఆందోళన చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, పెట్రోలు, డీజిల్పై విధిస్తున్న భారీ పన్నులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డీజిల్ ధరల పెరుగుదల ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజల జీవనం భారంగా మారిందని జిల్లా కార్యవర్గ సభ్యుడు చాట్ల బాబురావు ఆరోపించారు.
మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఇంధన ధరల పెరుగుదలతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. రైతులు ఎరువులు, యూరియా కొనుగోలు చేయడానికే ఇబ్బందులు పడుతున్నారని, సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని పేర్కొన్నారు.
ఆటో కార్మికులు మాట్లాడుతూ, పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలతో ఆదాయం తగ్గిపోగా ఖర్చులు పెరిగి ఉపాధి కోల్పోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వంటగ్యాస్ ధరల పెరుగుదలతో చిన్న హోటళ్ల నిర్వహణ భారంగా మారి అనేక హోటళ్లు మూతపడే పరిస్థితి ఏర్పడిందని హోటల్ నిర్వాహకులు తెలిపారు.
ఇంధన ధరలను వెంటనే తగ్గించి ప్రజలపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలని నిరసనకారులు ప్రభుత్వాలను కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆటో కార్మికులు, హోటల్ నిర్వాహకులు పాల్గొన్నారు.