పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం
పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం
ఏలూరు జిల్లా, ముసునూరు మండలం: ముసునూరు మండలం చింతలవల్లి శివారు కొత్తూరు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్న గంగుల ఏలి బాబు పిడుగుపాటుకు గురై దుర్మరణం చెందాడు.
సమాచారం మేరకు, ఏలి బాబు గొర్రెలను మేపేందుకు పొలాలకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు సంభవించాయి. ఈ క్రమంలో పిడుగు పడటంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
ఏలి బాబు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకుని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అకాలంగా కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. స్థానికులు మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.