పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ
పకడ్బందీగా ఓటరు జాబితా సవరణ: కలెక్టర్ కుమార్ దీపక్
అక్టోబర్ 1న తుది జాబితా విడుదల.. తప్పులు దొర్లితే కఠిన చర్యలు!
జిల్లాలో ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. గురువారం నస్పూర్ లోని కలెక్టరేట్ లో అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితర అధికారులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 25 నుండి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటి గణన చేపడతారని తెలిపారు. జూలై 31న హేతుబద్ధీకరించిన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించి, ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. ఎలాంటి పొరపాట్లు లేని స్పష్టమైన ఓటరు జాబితాను రూపొందించి, అక్టోబర్ 1వ తేదీన తుది జాబితాను విడుదల చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఒక కుటుంబంలోని ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓటరు గుర్తింపు కార్డులు కలిగి ఉంటే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేనిచో చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఓటరు జాబితాలో మరణించిన వారి వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదని, ఒకవేళ తుది జాబితాలో మృతుల పేర్లు వస్తే సంబంధిత బూత్ స్థాయి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వివరాల సేకరణ, ఫారాల పూరింపుపై బూత్ స్థాయి సిబ్బందికి, రాజకీయ పార్టీల ఏజెంట్లకు త్వరలోనే ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు.
అక్టోబర్ 1, 2026 నాటికి 18 సంవత్సరాల వయసు నిండే యువతీ యువకులు ఇంటింటి గణన సమయంలో ఫారం-6, డిక్లరేషన్ ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ వివరించారు. ఓటర్లు తమ వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1950 లేదా https://voters.eci.gov.in వెబ్సైట్, ECINET యాప్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. అనంతరం త్రైమాసిక తనిఖీల్లో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ ఈవీఎంల గోదామును పరిశీలించారు. గోదాం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.