Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. 49.20 లక్షల మంది చిన్నారులకు లక్ష్యం
అమరావతి | NTODAY NEWS
జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా ఆదివారం సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన పల్స్ పోలియో–2026 కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో సీఎం ఆప్యాయంగా మాట్లాడారు. చిన్నారులను ఎత్తుకుని ముచ్చటిస్తూ వారి ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా ఐదేళ్లలోపు సుమారు 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ప్రత్యేక పోలియో కేంద్రాలు, మొబైల్ వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.