రైతులు పంటల బీమా నమోదు చేసుకోవాలి
పంటల బీమా నమోదు చేసుకోండి – రైతులకు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ పిలుపు
చాట్రాయి మండల రిపోర్టర్ గోళ్ళ సత్యనారాయణ
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని రైతులు ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలకు తప్పనిసరిగా పంటల బీమా నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ సూచించారు. ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలు, కరువు, తుఫానులు తదితర అనుకోని పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు ఆర్థిక రక్షణ కల్పించడంలో పంటల బీమా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ప్రభుత్వం నోటిఫై చేసిన పంటలకు బీమా నమోదు చేయించుకోవడం ద్వారా పంట నష్టాల సమయంలో పరిహారం పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. వరి పంటకు పంటల బీమా నమోదు చేసుకునేందుకు ఆగస్టు 15, 2026 వరకు అవకాశం ఉన్నందున అర్హులైన రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతులు తమ సమీపంలోని సంబంధిత బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు (సీఎస్సీలు) లేదా ఎన్సీఐపీ యాప్ ద్వారా పంటల బీమా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా వెంటనే నమోదు ప్రక్రియ పూర్తి చేసి పంటలకు బీమా రక్షణ పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.