పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలుశిక్ష
పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలుశిక్ష : 5 వేల జరిమానా , బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం
మైనర్ బాలికకు సంబంధించిన పోక్సో కేసులో నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. కేసులో నిందితుడిగా ఉన్న ప్రతాప్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ మూడవత్ మల్లేష్కు 10 ఏళ్ల కారాగార శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది. అలాగే బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. 2020 సెప్టెంబర్ 8న డిండి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికకు సంబంధించిన ఘటనపై బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 97/2020 నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో మూడవత్ మల్లేష్పై ఆరోపణలు వెలుగులోకి రావడంతో పోలీసులు కీలక సాక్ష్యాధారాలను సేకరించి అభియోగపత్రం దాఖలు చేశారు. ఈ కేసు సెషన్స్ కేసు నంబర్ 101/2021గా న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. ప్రాసిక్యూషన్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ బలమైన వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం ప్రకటించింది. ఈ కేసు దర్యాప్తులో అప్పటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం. రాములు, అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ డి. వెంకటేశ్వర్లు, ప్రస్తుత స్టేషన్ హౌస్ ఆఫీసర్ సిహెచ్. బాలకృష్ణ, ప్రస్తుత సర్కిల్ ఇన్స్పెక్టర్ కే. బీసన్న, సిడిఓ పి. లింగయ్య, భరోసా లీగల్ ఆఫీసర్ మామిడి కల్పన తదితరులు సహకరించినట్లు అధికారులు తెలిపారు.