పోతనపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి రూ.10,000 సాయం – విద్యార్థి పట్టుదలకు అభినందనలు
ఏలూరు:
సమాజ సేవలో ముందుండే సాయి హెల్పింగ్ హ్యాండ్ ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమం జరిగింది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి రూ.10,000 నగదు సహాయం అందించారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోతనపల్లి గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి బాణావతు తులసి నాయక్ కుటుంబానికి ఈ సాయం అందజేశారు.
పదవ తరగతి పరీక్షల్లో 480 మార్కులు సాధించిన తులసి నాయక్ తండ్రి రాజుకు సభ్యులు ఈ సహాయం ఇచ్చారు. కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను దృష్టిలో ఉంచుకుని కొంతైనా ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ముందుకొచ్చినట్లు తెలిపారు.
పరీక్షల సమయంలో తల్లి పాముకాటు కారణంగా మృతి చెందడం తులసి నాయక్ జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అయినప్పటికీ ఆ బాధను జయించి ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించడం అతని పట్టుదల, లక్ష్యసాధనకు నిదర్శనంగా నిలిచింది. ఈ ఘటన అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.
కార్యక్రమంలో సంస్థ సభ్యులు పాల్గొన్నారు.