ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు ఎక్కడ..? నిబంధనలు ఉల్లంఘిస్తున్న కార్పొరేట్ స్కూళ్లపై విమర్శలు
ఏలూరు జిల్లా లో మరియు చాట్రాయి మండలం లో పాఠశాల నిబంధనలను తుంగలో తొక్కుతూ కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పాఠశాలలలో నోట్బుక్స్, యూనిఫామ్స్, షూస్, స్టేషనరీ వంటి వాటిని విక్రయించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, కొన్ని పాఠశాలలు వాటిని అమలు చేయడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పాఠశాల ప్రారంభానికి ముందు ఫైర్ సేఫ్టీ, ఎన్ఓసీ, శానిటేషన్ సర్టిఫికెట్, భవన స్థిరత్వ ధ్రువీకరణ, ట్రాఫిక్ క్లియరెన్స్, ఆటస్థలం వంటి అనుమతులు తప్పనిసరి అయినప్పటికీ, వాటిని పూర్తిగా పరిశీలించకుండానే అనుమతులు ఇస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆటస్థలం లేకుండానే కొన్ని పాఠశాలలు కొనసాగుతున్నాయని, ఇది విద్యార్థుల శారీరక అభివృద్ధిపై ప్రభావం చూపుతోందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బస్సుల ఫిట్నెస్ విషయంలో కూడా రవాణా శాఖ అధికారుల పర్యవేక్షణ కూడా లోపించిందని అనుభవజ్ఞులైన డ్రైవర్లు ఉన్నారా లేదా అనే విషయం పై అనుమానాలు కూడా ఉన్నాయని కొన్ని పాఠశాలలో వాహనాల డ్రైవర్లు అధిక స్పీడ్ తో వాహనాలు నడుపుతున్నారని దీనిపై కూడా సరైన పర్యవేక్షణ లేదని, కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ఆటోలతో కూడ విద్యార్థులను అధిక లోడుతో నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పల్లె ప్రాంతాల్లో ఫైర్ సేఫ్టీ తనిఖీలు సక్రమంగా జరగడం లేదని, విద్యాశాఖ పర్యవేక్షణలో లోపాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి కొన్ని ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అదే విధంగా, ఆకర్షణీయమైన ప్రకటనలు, కరపత్రాలతో విద్యార్థులను ఆకర్షించి, చేరిన తరువాత పూర్తి ఫీజులు వసూలు చేస్తున్నారని, తల్లిదండ్రులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కొన్ని పాఠశాలలు అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నాయని కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ నిబంధనలు కనుగుణంగా ఫీజులను ఏ తరగతికి ఎంత అనే విషయం బహిర్గతం చేసే విధంగా నోటీసు బోర్డులలో ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు
నిబంధనలు ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని లేదా ప్రమాణాలు పాటించని విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలని తల్లిదండ్రులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ ఇకనైనా స్పష్టమైన తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.