ప్రైవేటు విద్యాసంస్థల అధిక ఫీజులపై జాయింట్ కలెక్టర్కు వినతి
కందుకూరు: ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేయడం, పాఠ్యపుస్తకాలను అధిక ధరలకు విక్రయించడం వంటి అంశాలపై చర్యలు తీసుకోవాలని ఎంఆర్ మానవ హక్కుల సంఘం, అవినీతి వ్యతిరేక అసోసియేషన్ నాయకులు అధికారులను కోరారు.
జాతీయ అధ్యక్షుడు గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి, జాతీయ బోర్డు ఆఫ్ డైరెక్టర్ రొడ్డా తిరుపతయ్య ఆదేశాల మేరకు సంఘం ప్రతినిధులు కందుకూరులో సబ్ కలెక్టర్ డి. హిమవంసిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
కందుకూరు డివిజన్ పరిధిలోని పలు ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, పాఠ్యపుస్తకాలను కూడా యాజమాన్యాలే విక్రయిస్తూ భారీ మొత్తాలు వసూలు చేస్తున్నాయని వారు ఆరోపించారు. మొదటి తరగతి పుస్తకాలకే రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు.
ప్రతి ప్రైవేటు విద్యాసంస్థలో తరగతుల వారీగా ఫీజుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠ్యపుస్తకాల విక్రయాలు చేపడుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ సందర్భంగా డివిజన్ వైస్ ప్రెసిడెంట్ షేక్ సలాం మాట్లాడుతూ, ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులతో పాటు పుస్తకాల ధరలను కూడా ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నాయని అన్నారు. అలాగే రెండో శనివారం సెలవులు అమలు చేయడం లేదని, విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వారానికి కనీసం ఒకరోజు శారీరక విద్య (పీఈటీ) తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఎస్.డి. గౌస్ బాషా, వైస్ ప్రెసిడెంట్ షేక్ సలాం, వైస్ సెక్రటరీ మనోహర్, మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్. మాధవి తదితరులు పాల్గొన్నారు.