ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. రూ.1.25 కోట్ల ఉచిత ప్రమాద బీమా
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క రూపాయి అదనపు భారం లేకుండా రూ.1.25 కోట్ల ఉచిత ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. విమాన ప్రమాదం జరిగితే రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బీమా రక్షణ అందనున్నట్లు తెలిపారు.
18 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు గల ఉద్యోగులకు రూ.10 లక్షల జీవిత బీమా కూడా వర్తిస్తుందని చెప్పారు. ప్రమాదవశాత్తు శాశ్వత లేదా పాక్షిక వైకల్యం సంభవించినా ఆర్థిక సహాయం అందేలా పథకాన్ని రూపొందించినట్లు వివరించారు.
ఈ బీమా పథకం కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే కాకుండా, ప్రభుత్వ రికార్డుల ద్వారా వేతనాలు పొందుతున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని వెల్లడించారు.
అలాగే ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. త్వరలో ప్రత్యేక ట్రస్ట్ ద్వారా క్యాష్లెస్ హెల్త్ కార్డులు అందుబాటులోకి తీసుకువచ్చి నగదు రహిత వైద్య సేవలు కల్పించనున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమని, వారి కుటుంబాలకు పూర్తి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం, ఉద్యోగులు, బ్యాంకర్లు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.