ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..
- హత్య కేసు ఛేదించిన వాడపల్లి పోలీసులు
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం గ్రామంలో ఈ నెల 11న సంచలనం సృష్టించిన గోవింద్ హత్య కేసును వాడపల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు. భర్త ప్రవర్తన తమ బంధానికి అడ్డుగా మారాడనే కోపంతో భార్యే తన ప్రియుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. బుధవారం మిర్యాలగూడ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ సీఐ నాగదుర్గ ప్రసాద్ ఈ కేసు వివరాలను తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నర్సాపురం గ్రామానికి చెందిన గోవింద్కు సరోజతో వివాహం జరిగింది. అయితే, అదే ప్రాంతానికి చెందిన శ్రీను అనే వ్యక్తితో సరోజకు వివాహేతర సంబంధం ఏర్పడింది. వీరి వ్యవహారంపై భర్త గోవింద్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తరచూ గొడవ పడుతుండేవాడని తమ బంధానికి అడ్డు వస్తున్న గోవింద్ను ఎలాగైనా వదిలించుకోవాలని సరోజ, ఆమె ప్రియుడు శ్రీను పథకం వేశారని వెల్లడించారు. వారు వేసుకున్న పథకం ప్రకారం ఈ నెల 11వ తేదీన నిందితులు ఇద్దరూ కలిసి గోవింద్పై ఒక్కసారిగా దాడి చేశారు. ఆపై ఇంట్లో ఉన్న రోకలి బండతో తలపై బలంగా కొట్టి దారుణంగా హత్య చేశారని వెల్లడించారు.. మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న వాడపల్లి పోలీసులు రంగంలోకి దిగారు. వాడపల్లి పోలీసులు కేసును లోతుగా దర్యాప్తు చేసి, అనుమానితులుగా ఉన్న సరోజ, శ్రీనులను అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో నిందితులు తామే ఈ హత్య చేసినట్లు అంగీకరించారని తెలిపారు.. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన
రోకలి బండ
రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సకాలంలో స్పందించి, అత్యంత చాకచక్యంగా కేసును ఛేదించిన వాడపల్లి పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా రూరల్ సీఐ నాగదుర్గ ప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు.