ప్రజా సమస్యలు గాలికొదిలేసిన అధికారులు.. చాట్రాయిలో ప్రజల కష్టాలు పట్టవా?
తాగునీరు లేక ప్రజల అవస్థలు.. వీధి దీపాలు లేక చీకట్లో గ్రామాలు
ఏలూరు జిల్లా చాట్రాయి: మండలంలో ప్రజా సమస్యలు తీవ్రరూపం దాల్చుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బీజేపీ ఏలూరు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చాట్రాయి మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలోని 24 గ్రామాల్లో పంచాయతీ మోటార్లు, బోర్లు మూతపడటంతో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారని మండిపడ్డారు. వంటకు, స్నానానికి, పశువులకు అవసరమైన నీరు కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
చనుబండ గ్రామంలో నీటి సమస్యపై ప్రజలు రోడ్డెక్కి ధర్నా చేసినా అధికార యంత్రాంగం స్పందించకపోవడం దారుణమన్నారు. గ్రామాల్లో వీధి దీపాలు పనిచేయక రాత్రి వేళల్లో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు కొందరి స్వార్థ ప్రయోజనాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. అధికారులను ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పే పరిస్థితి లేదని అన్నారు.
కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని కొందరి నిర్లక్ష్యం దెబ్బతీస్తోందని హెచ్చరించారు. ప్రజా సమస్యలను పరిష్కరించిన నాయకులకే ప్రజల గుండెల్లో స్థానం ఉంటుందని స్పష్టం చేశారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల అభివృద్ధి అధికారులు వెంటనే స్పందించి నీటి సమస్యలు, వీధి దీపాల సమస్యలు, చెత్త నిర్వహణ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం కొనసాగిస్తే బీజేపీ జనతా వారధి కార్యక్రమం ద్వారా సబ్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రజల తరఫున పోరాటం చేస్తామని శ్రీకర్ బుర్రి హెచ్చరించారు.