ప్రజానేత గొర్రె లాజర్ మృతి పట్ల సర్వత్రా సంతాపం
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటకు చెందిన ప్రముఖ ప్రజానేత, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ నేత, ఎమ్మార్పీఎస్ ఆవిర్భావం నుంచి దళితులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన గొర్రె లాజర్ (71) గుండెపోటుతో జూన్ 2 రాత్రి కన్నుమూశారు. ఆయన మృతితో విస్సన్నపేట ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గొర్రె లాజర్కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమ అభివృద్ధికి విశేష కృషి చేసిన ఆయన, సంస్థ కార్యక్రమాల కోసం మందాకృష్ణ మాదిగను విస్సన్నపేటకు ఆహ్వానించి ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. సిండికేట్ బ్యాంకులో ఉద్యోగిగా సేవలందించిన ఆయన పదవీ విరమణ అనంతరం కూడా ప్రజాసేవను కొనసాగిస్తూ సామాజిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
ప్రజా సమస్యలపై రాజకీయాలకు అతీతంగా అందరితో కలిసి పనిచేసిన లాజర్ మృతి పేద ప్రజలకు తీరని లోటని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన డి. హరినాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజకీయాలు వేరైనా ప్రజా ప్రయోజనాల విషయంలో లాజర్తో కలిసి పనిచేసిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను కొనియాడారు.
గొర్రె లాజర్ మృతి పట్ల వివిధ రాజకీయ పార్టీల నేతలు, సామాజిక సంఘాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా సంతాపం వ్యక్తం చేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.