ప్రకృతి వ్యవసాయం - వ్యవసాయ శాఖ
ప్రకృతి వ్యవసాయం - వ్యవసాయ శాఖ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం (APCNF) పై రైతు సేవ కేంద్రం సిబ్బందికి అవగాహన మరియు క్షేత్ర దర్శనం నిర్వహించారు.
మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మీ గారు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో రసాయనాలు లేని ఆరోగ్యకరమైన జీవన శైలికి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలు తినడం ఎంత ముఖ్యమో వివరించారు. 0-20 సెంట్ల పొలంలో ATM (Any Time Money) విధానాన్ని అవలంబించి ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మెంటర్ కె లక్ష్మీ గారి పొలాన్ని పరిశీలించారు. ఈ పొలంలో 5 సెంట్ల భూమిలో 15 రకాల మొక్కలు (కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులు, పండ్ల మొక్కలు) పండించడం వలన రైతుకు సంవత్సరం పొడుగునా ఏదో ఒక పంట ద్వారా రాబడి వస్తుందని తెలిపారు. ఇతర రైతులు కూడా తమ భూమిలో కొన్ని సెంట్లు ఈ విధానాన్ని పాటించాలని రైతు సేవ కేంద్ర సిబ్బందికి సూచించారు.
ప్రకృతి వ్యవసాయం యూనిట్ ఇంచార్జ్ జి శ్రీనివాసరావు ద్రవ జీవామృతం, బీజామృతం మరియు విత్తన గుళికల తయారీ విధానాలు మరియు వాటి ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సేవ కేంద్రం సిబ్బంది మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.