ప్రకృతి వ్యవసాయంలో PMDS సాగుతో రైతులకు లాభాలు
ప్రకృతి వ్యవసాయంలో PMDS సాగుతో రైతులకు లాభాలు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలో రైతులు పంటలు కోసిన అనంతరం జనుము, జీలుగా, పిల్లి పెసర వంటి పచ్చిరొట్ట ఎరువులను పెంచడంతో పాటు ప్రకృతి వ్యవసాయంలో PMDS (ప్రీ మాన్సూన్ సోయింగ్ సాగు) విధానాన్ని అవలంబించాలని వ్యవసాయ శాఖ సూచించింది. నవధాన్యాల సాగు ద్వారా సంవత్సరం పొడవునా భూమి పంటలతో కప్పబడి ఉండేలా చేయడం ఈ విధానం ప్రధాన లక్ష్యంగా అధికారులు తెలిపారు.
ఈ PMDS విధానంలో పప్పు జాతి, నూనె జాతి, పచ్చిరొట్ట, ధాన్యపు జాతులకు చెందిన మినుములు, పెసర, బొబ్బర్లు, ఆముదాలు, నువ్వులు, రాగులు, సజ్జలు, జొన్నలు, తోటకూర, పాలకూర విత్తనాలను కలిపి ఒక ఎకరానికి 10 నుంచి 12 కిలోల వరకు విత్తనాలు చల్లితే భూమి పూర్తిగా కప్పబడి సాగు ప్రక్రియ సులభమవుతుందని అధికారులు తెలిపారు.
PMDS విధానం వల్ల కలిగే ప్రయోజనాలు
వివిధ రకాల పంటల వల్ల నేలలో సూక్ష్మజీవులకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
నేల గుల్లగా మారి వానపాముల సంఖ్య పెరుగుతుంది.
పచ్చి మేతగా వినియోగించుకోవచ్చు.
భూమిలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
పలు రకాల పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.
నేలలో సేంద్రీయ కార్బన్ పదార్థం పెరుగుతుంది.
ప్రధాన పంటల్లో కలుపు మొక్కలు తగ్గుతాయి.
రసాయనిక ఎరువుల వినియోగం తగ్గుతుంది.
జీవ వైవిధ్యం పెరుగుతుంది.
ఈ నవధాన్యాల సంచులు ప్రతి రైతు సేవా కేంద్రంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, VAA/VHAల ద్వారా రైతులకు ఈ వారం రోజులలో అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చాట్రాయిలోని RSK కేంద్రంలో కొంతమంది రైతులకు నవధాన్యాల సంచులను అందజేశారు. కార్యక్రమంలో FMMT కన్నమ్మ, ఐసిఆర్పీలు, VAA & VHAలు పాల్గొన్నారు. ఈ విషయాన్ని చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ వెల్లడించారు.