ప్రమాదంలో యూట్యూబర్ మృతి..
ప్రమాదంలో యూట్యూబర్ మృతి.. కుటుంబానికి 5 లక్షల సహాయం చేసిన 164 గ్రామాల మత్స్యకార కాపులు
ఒంగోలు ప్రాంతానికి చెందిన యువ యూట్యూబర్, అనుపాత్రికేయుడు శివారెడ్డి ప్రమాదవశాత్తు మృతి చెందడంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. కడలూరు మరబోట్ల వివాదంపై నిర్వహించిన సమావేశానికి న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన శివారెడ్డి, తిరుగు ప్రయాణంలో చాకిచెర్ల తుమ్ములు మలుపు వద్ద జరిగిన మోటార్సైకిల్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.
మృతుడికి భార్యతో పాటు 9 సంవత్సరాలు, 5 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆదారంగా ఉన్న శివారెడ్డి ఆకస్మిక మరణంతో వారు దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లారు.
ఈ విషాదం గురించి తెలుసుకున్న 164 గ్రామాల మత్స్యకార కాపులు మానవత్వంతో స్పందించారు. ముందుగా ఇచ్చిన హామీ మేరకు సమావేశం నిర్వహించి, శివారెడ్డి ఇద్దరు చిన్నారుల పేర్లపై రూ.5 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్గా జమ చేయనున్నట్లు ప్రకటించారు.
సమావేశానికి చిన్నారులను తీసుకురాగానే వారి పరిస్థితి చూసి కాపులు భావోద్వేగానికి గురయ్యారు. “మా జీవన విధానాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయుని కుటుంబానికి న్యాయం చేయడం మా బాధ్యత” అని తెలిపారు.
కాపుల ఈ సహాయ చర్యపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే సహచర పాత్రికేయులు కూడా కాపుల సేవాభావానికి కృతజ్ఞతలు తెలిపారు.