ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం: నూజివీడులో అవగాహన ర్యాలీ
ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు.
నూజివీడు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీలో మాదక ద్రవ్యాల వల్ల వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలపై కలిగే ప్రతికూల ప్రభావాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ, మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయని, వాటికి దూరంగా ఉండి విద్య, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు.
మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని కోరారు.
ఈ సందర్భంగా పాల్గొన్న వారందరూ "మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటాం – ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తాం" అంటూ ప్రతిజ్ఞ చేశారు.
కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఎ. మస్తానయ్య, ఏలూరు ఎన్ఫోర్స్మెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.ఎస్.డి. భోగేశ్వరరావు, శాఖ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండే సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు.