ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామిక వేత్త రావాలి
ప్రతి కుటుంబం నుండి ఒక పారిశ్రామిక వేత్త రావాలి అన్నదీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం -ఎంపీ చిన్ని
అమరావతిలో భాగమైన విజయవాడ నగరంలో అంబేద్కర్ కళాక్షేత్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసి ప్రజలకు అందించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు కి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
విజయవాడలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్లో ఎమ్మెల్యే చిన్ని ప్రసంగిస్తూ, భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఎంఎస్ఎంఈలు నిలుస్తాయని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర 2047, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలు సాధించాలంటే ముందుగా ఎంఎస్ఎంఈలు బలోపేతం కావాలని అన్నారు.
చంద్రబాబు నాయుడు దూరదృష్టి కలిగిన నాయకుడని, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ప్రవేశపెట్టిన పవర్ పాలసీ, ఐటీ పాలసీ, మౌలిక వసతుల అభివృద్ధి వంటి చర్యలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని చెప్పారు. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్, మెట్రో, ఎయిర్పోర్ట్, జీనోమ్ వ్యాలీ వంటి ప్రాజెక్టులు ఆయన విజన్కు నిదర్శనమన్నారు. ప్రపంచాన్ని కరోనా సమయంలో ఆదుకున్న భారత్ బయోటెక్ వంటి సంస్థలు జీనోమ్ వ్యాలీ ద్వారా ఎదగడం గర్వకారణమని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతం “బ్రాండ్ సీబీఎన్” కారణంగానే పెట్టుబడులు వస్తున్నాయని చిన్ని పేర్కొన్నారు. గతంలో రాష్ట్రం కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడేనని అన్నారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు, పరిశ్రమలు రావడానికి ఆయన నాయకత్వమే కారణమని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచన యువతకు గొప్ప అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. “ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త” అనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. త్వరలో రాష్ట్రానికి భారీ స్థాయిలో ఎంఓయూలు రానున్నాయని, దేశంలోని ప్రముఖ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నాయని వెల్లడించారు.
గత రెండు సంవత్సరాల్లో ప్రభుత్వం సుమారు 35 పారిశ్రామిక విధానాలను తీసుకొచ్చిందని, యువత ఈ అవకాశాలను వినియోగించుకొని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని పిలుపునిచ్చారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద ఎఫ్డీఐలలో ఒకటైన 15 బిలియన్ డాలర్ల ఏఐ పెట్టుబడి రాష్ట్రానికి రావడం చంద్రబాబు నాయకత్వ ప్రతిభకు నిదర్శనమని అన్నారు. అదేవిధంగా రిలయన్స్ సంస్థ కూడా ఏఐ డేటా సెంటర్లలో భారీగా పెట్టుబడులు పెట్టబోతుందని పేర్కొన్నారు.
విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి, అమరావతి వంటి ప్రాంతాల్లో గ్రీన్ ఎనర్జీ, అమోనియా, క్వాంటమ్ కంప్యూటింగ్, ఏఐ డేటా సెంటర్లు, డిఫెన్స్, స్పేస్ సిటీ వంటి భవిష్యత్ రంగాలకు సంబంధించిన పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. ఈ పరిశ్రమల ద్వారా ఎంఎస్ఎంఈలకు విస్తృత అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
క్లస్టర్ ప్రోగ్రామ్ల ద్వారా ప్రతి క్లస్టర్లో కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి చిన్న పరిశ్రమలకు ఊతమిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంపై మాత్రమే ఆధారపడకుండా, ఐపీఓలు, ఆర్థిక సంస్థలు, పెట్టుబడి అవకాశాలను వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్ నుంచి మరిన్ని ఎంఎస్ఎంఈలు ఐపీఓలకు వెళ్లే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలపాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయ సాధనలో అందరూ భాగస్వాములు కావాలని ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు.