పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ
పుంగనూరు గూడూరు పల్లి వద్దగల టిడ్కో వాసుల కన్నీటి కథ
పుంగనూరు మండలం గూడూరుపల్లి
సమీపంలోని జగనన్న కాలనీ టిడ్కో హౌస్ అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గృహ కల నెరవేరిందన్న ఆనందం క్రమంగా సమస్యల మయంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మౌలిక వసతుల లేమితో జీవనం దుర్భరంగా మారడంతో ఇక ఇళ్లు ఖాళీ చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని నివాసితులు చెబుతున్నారు. ఈ మేరకు వారు గురువారం మీడియాతో వారి బాధలను వివరించారు మూడు సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఎంతో ప్రచారంతో ఈ టిడ్కో గృహాలను ప్రారంభించి పేదలకు సొంత ఇల్లు కల నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం ఆ కాలనీలో నీటి కొరత తీవ్రంగా ఉందని, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో చెత్త నీరు పేరుకుపోయి దుర్వాసన వస్తోందని స్థానికులు తెలిపారు. వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రివేళల్లో కాలనీ మొత్తం చీకటిలో మునిగిపోతుందని, దాని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలనీ పరిసరాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని మహిళలు చెబుతున్నారు. అంతేకాకుండా పాములు వంటి విషపూరిత జంతువులు తరచూ కనిపిస్తున్నాయని, పిల్లల భద్రతపై భయం నెలకొన్నదని పేర్కొన్నారు. ఈ సమస్యలపై మున్సిపల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు. భద్రతా పరంగా పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందని నివాసులు తెలిపారు. రాత్రివేళల్లో కొంతమంది యువకులు మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాలు సేవిస్తూ అపార్ట్మెంట్ల ముందు హంగామా చేస్తున్నారని, నడి రోడ్డుపైనే గొడవలు పడుతున్నారని చెప్పారు. ఆడపిల్లలు బయటకు రావడానికి భయపడే పరిస్థితి నెలకొన్నదని, అసభ్య ప్రవర్తనతో వేధింపులు ఎదుర్కొంటున్నామని మహిళలు వాపోయారు. పోలీస్ అవుట్పోస్ట్ లేకపోవడం వల్ల సమస్యలు మరింత పెరుగుతున్నాయని, ఫిర్యాదు చేసిన వారిపైనా బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. ఇక కాలనీ ఊరికి దూరంగా ఉండటం వల్ల విద్య, వైద్యం వంటి అవసరాల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని నివాసులు తెలిపారు. చిన్న పిల్లలకు సమీపంలో స్కూల్ సౌకర్యం లేకపోవడంతో, అలాగే ఎవరైనా అనారోగ్యానికి గురైతే తక్షణ చికిత్స అందుబాటులో లేక పుంగనూరు పట్టణానికి దాదాపు మూడు కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. మొదట అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి ఇళ్లను ఇచ్చి, ఇప్పుడు సమస్యలను పట్టించుకోకపోవడం బాధాకరమని నివాసితులు పేర్కొన్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తాగునీరు, డ్రైనేజీ, వీధి దీపాలు, భద్రతా చర్యలు, చెత్త నిర్వహణ వంటి మౌలిక వసతులు కల్పించి తమ సమస్యలను పరిష్కరించాలని టిడ్కో కాలనీ ప్రజలు డిమాండ్ చేశారు.