ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు బంగారం మాయం.. ఎస్పీని ఆశ్రయించిన బాధితుడు
పల్నాడు జిల్లాలో తాకట్టు పెట్టిన బంగారం మాయమైన ఘటన కలకలం రేపింది. సత్తెనపల్లి మండలం భీమవరానికి చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టిన సుమారు రూ.8 లక్షల విలువైన బంగారం కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడు 2024 జూలైలో 28 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.1 లక్ష రుణం తీసుకోగా, అదే ఏడాది నవంబర్లో మరో రూ.80 వేలు రుణంగా పొందినట్లు తెలిపాడు. అనంతరం రుణాన్ని చెల్లించి బంగారం తీసుకునేందుకు కంపెనీకి వెళ్లగా అధికారులు కొంత గడువు కావాలని కోరినట్లు పేర్కొన్నాడు.
అయితే, కంపెనీ మేనేజర్ ఉద్యోగం వదిలేసి, తాకట్టు బంగారాన్ని విక్రయించినట్లు తనకు సమాచారం అందిందని బాధితుడు ఆరోపించాడు. దీంతో సుమారు రూ.8 లక్షల విలువైన ఆభరణాలు మాయమైనట్లు పేర్కొంటూ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి తనకు న్యాయం చేయాలని బాధితుడు పోలీసులను కోరాడు.