రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు.. ఘన నివాళులు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పారుపల్లి విజయకుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలుపుల వెంకటేశ్వర్లు రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని ఆధునిక సాంకేతిక రంగం వైపు నడిపించిన దూరదృష్టి కలిగిన నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ప్రజాసేవలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కోన ధనికుమార్, జిల్లా కాంగ్రెస్ నాయకులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.