రాముని చెరువు అభివృద్ధి పనుల్లో భారీ అవకతవకలు
కేంద్ర నిధులు దుర్వినియోగం అవుతున్నాయని బీజేపీ ఆగ్రహం
చెరువు కట్ట వద్ద తులా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో నిరసన
హెచ్సీఏకు స్థల కేటాయింపు ప్రతిపాదనలపై తీవ్ర ఖండన
మంచిర్యాల పట్టణంలోని రాముని చెరువు అభివృద్ధి, పరిరక్షణ పనులలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆదివారం చెరువు కట్ట వద్ద పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను అధికారులు, పాలకులు కలిసి దుర్వినియోగం చేస్తున్నారని పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకారులు అధికారుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, నిధుల వినియోగంపై తక్షణమే విచారణ జరపాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన పార్టీ నాయకులు తులా మధుసూదన్ రావు మాట్లాడుతూ, చెరువు పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం కింద రూ. 1.98 కోట్లను మంజూరు చేసిందని తెలిపారు. అయితే అధికారులు ఈ నిధులను చెరువు రక్షణకు ఉపయోగించకుండా, అనవసరమైన పనులకు మళ్లిస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. చెరువును క్రమంగా పూడ్చివేస్తున్నారని, లోకాయుక్తలో దీనిపై ఇప్పటికే కేసు నడుస్తున్నప్పటికీ అధికారులలో చలనం లేదని మండిపడ్డారు. స్థానిక శాసనసభ్యులు స్పందించి ఈ అక్రమాలపై విచారణ జరిపించాలని, చెరువుకు సంబంధించిన 47 ఎకరాల 32 గుంటల స్థలాన్ని గుర్తించి కాపాడాలని కోరారు
మరోవైపు హైదరాబాద్ క్రికెట్ సంస్థకు చెరువులోని కొంత భాగాన్ని కేటాయించే ప్రతిపాదనను నాయకులు తీవ్రంగా ఖండించారు. జలాశయాలను పూడ్చి ఆట స్థలాలుగా మార్చడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న స్వచ్ఛంద పౌర సేవ సంస్థ అధ్యక్షులు కనుకుంట్ల మల్లయ్య మాట్లాడుతూ, అధికారులకు కేవలం నిధులు ఖర్చు చేయడంపైనే శ్రద్ధ ఉందని, భవిష్యత్ తరాలకు ఈ జలాశయం ఎంత అవసరమనే ఆలోచన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న పనులను ఆపి, చెరువు చుట్టూ రక్షణ కంచెను ఏర్పాటు చేసి కబ్జాల బారి నుండి కాపాడాలని డిమాండ్ చేశారు