రాంపూర్హట్లో మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి
రాంపూర్హట్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనకోడలు బృష్టి ముఖర్జీ ఘటక్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాంపూర్హట్లోని తన నివాసంలో బుధవారం మధ్యాహ్నం ఉరి వేసుకున్నట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.
వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా.. బృష్టి ముఖర్జీ ఘటక్, ఆమె భర్త మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విడాకుల కోసం వారు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఈ కేసు విచారణ దశలోనే ఉంది.
మరోవైపు బృష్టి కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు కుటుంబ వర్గాల నుంచి సమాచారం. అయితే ఆమె మృతికి అసలు కారణాలు ఏమిటన్నది పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.