GHMCలో రూ.70 కోట్ల డబుల్ బిల్లులు
102 మంది కాంట్రాక్టర్లకు రెండుసార్లు చెల్లింపులు.. 12 మంది నుంచి రూ.7 కోట్లు రికవరీ
హైదరాబాద్ | Ntoday News
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో భారీగా డబుల్ బిల్లుల చెల్లింపులు జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. మొత్తం 102 మంది కాంట్రాక్టర్లకు సుమారు రూ.70 కోట్ల మేర రెండుసార్లు బిల్లులు చెల్లించినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.
విషయం వెలుగులోకి రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 12 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.7 కోట్లను తిరిగి వసూలు చేసినట్లు తెలుస్తోంది. మిగిలిన మొత్తాన్ని కూడా రికవరీ చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
ఈ వ్యవహారంలో బాధ్యత వహించినట్లు భావిస్తున్న ఆడిట్ శాఖ అధికారి శరత్ చంద్రపై చర్యలు తీసుకుని వేటు వేసినట్లు సమాచారం.
కాగా, డబుల్ బిల్లుల చెల్లింపుల వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపేందుకు GHMC కమిషనర్ ఆర్వీ కర్ణన్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.